కోహ్లీ, రాహుల్ ఎలా రాణిస్తారో..? భారత్-దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి..!

  • 19 నుంచి వన్డే సిరీస్ మొదలు
  • 23న చివరి వన్డే మ్యాచ్ 
  • సారథిగా కాకుండా బరిలోకి దిగుతున్న కోహ్లీ
  • కెప్టెన్ గా బాధ్యతలు మోయనున్న రాహుల్
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ లో ఓటమి చూసిన టీమిండియా బుధవారం నుంచి ఆరంభమయ్యే వన్డే సిరీస్ లో ఏ మేరకు రాణిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టు సారథ్య బాధ్యతలను విడిచిపెట్టిన తర్వాత ఆడబోయే మొదటి మ్యాచ్ అవుతుందిది. జట్టులో ఒక సాధారణ ప్లేయర్ గా (కెప్టెన్ గా కాకుండా) ఏడేళ్ల తర్వాత కోహ్లీ ఆడుతుండడమే విశేషం.

మరోపక్క, రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. దీంతో ఓపెనర్ కేఎల్ రాహుల్ కు జట్టును నడిపించే చక్కని అవకాశం లభించింది. దీన్ని రాహుల్ సద్వినియోగం చేసుకుంటాడా? అన్నది మరో ఆసక్తికర అంశం. ఈ విషయంలో కోహ్లీ సూచనలను తప్పకుండా తీసుకునే అవకాశం ఉంది. వన్డే సిరీస్ ను గెలుచుకుంటే కనుక అది రాహుల్ కు పెద్ద ప్లస్ అవుతుంది. మున్ముందు మంచి అవకాశాలకు మార్గం ఏర్పడుతుంది.

కోహ్లీని ఎప్పటికీ నాయకుడిగానే జస్ప్రీత్ బుమ్రా అభివర్ణించడం గమనార్హం. దీంతో కేఎల్ రాహుల్ కు కోహ్లీ ఏ మేరకు సూచనలు ఇస్తాడు, బ్యాట్ తో ఏ మేరకు రాణిస్తాడో చూడాల్సి ఉంది. సారథిగా కానప్పుడు సెలక్టర్లు చూసేది ఆటగాడి ప్రదర్శననే. కనుక బ్యాటింగ్ తో రాణించడం కోహ్లీకి ప్రతిష్ఠాత్మకం అవుతుంది. అసలే బీసీసీఐతో కోహ్లీకి సంబంధాలు బలహీనపడ్డాయన్న ప్రచారం నడుస్తోంది. కనుక ఇద్దరు ఆటగాళ్ల ప్రతిభకు, భారత జట్టు రాణింపునకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కీలకంగా నిలవనుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే, 23న చివరి వన్డే మ్యాచ్ జరగనున్నాయి. 

India vs South Africa
odi
Virat Kohli
kl rahul

More Telugu News